బాధ్యత
రైల్వే స్టేషన్ లో రైలు కోసం జనాలు ఎదురుచూస్తున్నారు.
ఒక మధ్య వయసు జంట పిల్లలతో ఒక బెంచ్ దగ్గర కూచున్నారు.
పక్కన ఒక వృద్ధ జంట కూచున్నారు.ఆయన ఎదో పుస్తకం చదువుతున్నారు.
ఎక్కడి వరకు వెళ్తున్నారు మాట కలిపాడు మద్య వయసాయన.మేము విజయవాడ వెళుతున్నాం.
మరి మీరో అంటూ అడిగాడు ఆ వృద్ధుడు అతన్ని .
మేమూ విజయవాడ వరకే అని చెప్పి మీకు రిజర్వేషన్ వుందా అని అడిగాడు మద్యవయసాయన.
ఆ ఉందండీ మా అబ్బాయి చేశాడు. S5 లో చెప్పాడు పెద్దాయన.
అరే మాది కూడా S5 బోగీనే అన్నాడు, వాళ్ళవి ఎదురెదురు సీట్లు అని తెలుసుకున్నారు.
'ఆ పుస్తకం ఏమిటండీ అడిగాడు' మద్యవయసాయన, ఆ పెద్దాయనని
పుస్తకం అట్ట చూపిస్తూ "రామాయణం"
చెప్పాడు పెద్దాయన.
'ఇపుడు ఎంత వరకు చదివారు' అడిగాడు మధ్యవయసాయన.
'సీతా సమేతంగా రామ లక్ష్మణులు అడవికి వెళ్లారు. అక్కడ మద్యలో గుహుడు కలిశాడు.'
'ఆ అవన్నీ ఈ వయసులో ఇపుడు నాకు ఎందుకు లెండి రిటైర్ అయ్యాక తీరిక గా చదువుకుంటా' అన్నాడు మద్యవయసాయాన. ఆ వృద్ధుడు నవ్వి మళ్లీ పుస్తకం చదవటం లో మునిగిపోయాడు.
రైలు ఇక్కడ 3 నిమిషాలు మాత్రమే ఆగుతుంది.
జనాలు కాస్త ఎక్కువగానే వున్నారు.త్వరగా రైలు ఎక్కేయాలి పిల్లలు, జాగ్రత్త, ఆ లగేజి అంతా ఒకేచోట పెట్టు. అటు ఇటు వెళ్లకండి. రైలు రాగానే జనాలు తోసుకుని వస్తారు. బొమ్మల్లా కూర్చోకుండా నా వెంటే రండి....
అంటూ భార్య కీ ఆదేశాలు జారీ చేస్తున్నాడు మథ్యవయసాయన.
మరి కాసేపట్లో రైలు వచ్చింది.
లగేజీ తీసుకుని రా రా అలా నిలబడిపోతవేంటి అని భార్యను అరుస్తూ ముందుకు కదిలాడు మద్యవయసాయన. జనాలని తోసుకుంటూ ముందు ఆయన ఎక్కేసాడు. వెనకే భార్య పిల్లలు వస్తున్నారులే అనుకున్నాడు.
తీరా ఎక్కి చూశాక భార్య, పిల్లలు కనపడలేదు,
లగేజి బెర్త్ మీద పెట్టి, పెద్దాయన కి లగేజి చూస్తుండండి అని చెప్పి వెనక్కి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి చూసాడు. ఇంకా అతని భార్య పిల్లలు ఎక్కడం లోనే వున్నారు. అంతలో రైలు కూత పెట్టింది. కసురుకుంటూ భార్య చేయిని పట్టుకుని లోపలికి లాగేసాడు. పిల్లలని కూడా లోనికి లాగేసాడు.
అంతటితో ఆగకుండా ఇందుకే మిమ్మల్ని బయటికి తీసుకు రాను. లోక జ్ఞానం లేదు, నీకు రైలు ఎక్కడం కూడా రాదా, నా వెంటే ఎక్కు అంటే వినపడదా.
నిన్ను కాదు మీ నాన్నని అనాలి. నిన్ను నాకు అంటగట్టారు అని గెట్టిగా అరుస్తున్నాడు. రైలు కదిలింది.
కాసేపటికి ఆయన శాంతించాడు. వాళ్ళ ఎదురు బెర్త్ లో కూచున్న వృద్ధుడు మళ్లీ రామాయణం చదవటం మొదలు పెట్టాడు.
'ఏముందండి ఆ పుస్తకం లో ఎప్పుడో జరిగిందట, రాసారట, ఇంత టెక్నాలజీ వచ్చింది. ఇంకా ఆ పుస్తకం పట్టుకుని చదువుతున్నారు,' అన్నాడు మద్యవయసాయన.
పెద్దాయన అతని వైపు చూసి చిన్నగా నవ్వి,
"ఇందాక రైలు ఎక్కేపుడు మీరు ఎంత కంగారు పడ్డారు. మీ భార్య, పిల్లలు, లగేజీ ని రైలు ఎక్కించటానికి కాస్త ప్రయాస పడ్డారు. నేను, నా భార్య కాస్త ముసలి వాళ్ళం అయినా కూడా మేము హడావిడి లేకుండా రైలు ఎక్కేసాం."
"ఫ్లాట్ ఫారం మీద వున్నపుడు మీరు అడిగారు, పుస్తకం ఏమిటి అని. నిజానికి నేను రామాయణం మొదటి సారి చదువుతున్నాను. సీతా సమేతంగా రామ లక్ష్మణులు అడవికి వెళ్లారు. అక్కడ మద్యలో గుహుడు కలిశాడు అని చెప్పాను."
"అవును, గుహుడు పడవలో వాళ్ళను ఎక్కించుకుని అవతలి ఒడ్డుకు చేర్చాడు" అంతేగా ఏముంది అందులో అన్నాడు మద్యవయసాయన.
"ఆ ఆ అంతే కాకపోతే, ముందుగా పడవని సీతమ్మ ఎక్కింది, తరువాత లక్ష్మణుడు ఎక్కాడు, ఆఖరున రాముడు ఎక్కాడు. తరువాత పడవ ముందుకు కదిలింది. ఈ వృత్తాంతం అంతా నేను ఫ్లాట్ ఫారం మీదనే చదివాను. ముందు మనల్ని నమ్ముకుని మనతో వచ్చిన వారిని బాగా చూసుకోవాలి..తరువాత మన గురించి మనం ఆలోచించాలి. అని దాని భావం..అందుకే రైలు ఎక్కెటపుడు ముందు నా భార్యని ఎక్కించా, లగేజి తీసుకుని తన వెనక నేను ఎక్కేసా... మనం ఎలా బతకాలి అని ఏ టెక్నాలజీ మనకి చెప్పదు" అన్నాడు పెద్దాయన. ఇలాగే మహాగ్రంథాలలో మనకు జీవన విధానాన్ని, నైతిక విలువలను నేర్పించే సంఘటనలు ఉంటాయండి, వాటిని మన పరిస్థితులకు అన్వయించుకుంటే చాలా సమస్యలకు పరిష్కారాలు ఇలాంటి పుస్తకాల్లో దొరుకుతాయి..
టెక్నాలజీ ఎంతపెరిగినా జీవనవిధానంలో ఎంత మార్పు వచ్చినా, సరైన పద్దతిలో జీవించేందుకు టెక్నాలజీ కన్నా మన నడవడిక మాత్రమే ముఖ్యం, ఆ నడవడిక ఎలా ఉండాలో చెప్పేవే మహాగ్రంథాలు, ఈ పుస్తకాలు లైఫ్ టైం అప్ డేటెడ్ అంటూ వివరించారు పెద్దాయన..
No comments:
Post a Comment