చదువుకున్న మూర్ఖులు
ఒకపండితుడి దగ్గర విద్య నేర్చుకొని, బ్రతుకు తెరువు కోసం నగరానికి బయలుదేరారు ముగ్గురు శిష్యులు. వాళ్ళతో పాటు చదువు రాని ఒక పనివాడు కూడా ఉన్నాడు. వాళ్ళు అడవిలో ప్రయాణిస్తుండగా ఒక ఎండిపోయిన సింహం కళేబరాన్ని చూశారు.
ఆ ముగ్గురు శిష్యుల్లో ఒకడు, “ఆహా! మన తెలివితేటలూ, విద్యని ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది. ఈ ఎముకలన్నిటిని సింహంశరీరంలో ఎలా ఉంటాయో ఆలా అమర్చగలను,” అన్నాడు. మరో శిష్యుడు, “నేను నా మంత్ర శక్తితో మాంసం, రక్తం, చర్మం, అన్నీసమకూర్చగలను,” అన్నాడుగర్వంగా. మూడో శిష్యుడు, “చూస్తూ ఉండండి, నామంత్రశక్తి తోసింహానికి ప్రాణం పోయగలను,” అన్నాడు.
చదువు రాని సేవకుడు, “అయ్యా! అది కౄర జంతువు. దానికి ప్రాణంవస్తే మనల్ని చంపేస్తుందయ్యా! వద్దయ్యా,” అంటూ బ్రతిమిలాడసాగాడు. వాళ్ళు ముగ్గురూ వీణ్ణి చూసి, “ఓరి పిరికివాడా” అంటూ నవ్వ సాగారు. దాంతో ఆ సేవకుడు గబ గబా దగ్గర్లో ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు భయం భయంగా.
విద్యావంతులైన ఆ ముగ్గురూ గబగబా వాళ్లకు చేతనైన విద్యని ప్రదర్శించి ఆ సింహానికి ప్రాణం కూడా పోశారు. సజీవమైన ఆ సింహం ఊరుకుంటుందా? పంజా బలంగా విసిరి, ముగ్గరి నీ చంపేసి అడవిలోకి పారి పోయింది .చెట్టెక్కిన సేవకుడు, చదువు రాక పోయినా, ప్రాణాలతో బైట పడ్డాడు. ముగ్గురూ చని పోయారని విచారిస్తూ వెనక్కి వెళ్ళిపోయాడు.
నీతి: చేసే పని పర్యవసానం ఏమిటో సరిగ్గా ఆలోచించ కుండా ఏ పనీ చేయరాదు.
No comments:
Post a Comment