🌸❄️ పాప పుణ్యాలు ❄️🌸
మనం చేసే పాప పుణ్యాలు మూడు విభాగాలుగా ఉంటాయి.
ఒకటి. అతిసామాన్య పుణ్యము అతిసామాన్య పాపము.
రెండు. సామాన్య పుణ్యము. సామాన్య పాపము.
మూడు. అనన్య సామాన్య పుణ్యము. అతి ఘోర పాపము.
దైవము అతిసామాన్య పుణ్యములను, అతి సామాన్య పాపములను, కలలో అనుభవించే విధముగా చేస్తుంది.
ఉదాహరణకు మనం బిక్షాటనకు వచ్చే వానికి దానం చేయలనుకుని జేబులో చెయ్యిపెట్టుకుంటే,
మనం అనుకున్న పైకం, జేబులో సమయానికి లేకపోతుంది. మనం మనస్సులో నొచ్చుకుంటాము.
ఈలోపల మన ఎక్కవలసిన బస్సు వచ్చేస్తుంది. మనం దానం చేయకుండానే ఇంటికి వెళ్ళిపోతాము. దానం చేయాలనే భావన రావడం కూడా ఒకరకమైన పుణ్యమే. కాని దానం చేయలేదు కాబట్టి ఇది అతిసామాన్య పుణ్యఖాతాలోనికి వెళుతుందన్నమాట.
ఇలాంటి అతిసామాన్య పుణ్యాలను మనము కలలో " ఏదో పదోన్నతి పొందినట్లో" అనుభవింపచేస్తుంది. అలాగే అతిసామాన్య పాపములు.
ఇక అనన్య సామాన్య పుణ్యములను, అతి ఘోరపాపములను ఈ జన్మలోనే అనుభవించేటట్లు చేస్తుంది.
మనం ఎదో పెద్ద యాగము చేశామనుకోండి, దైవము ఆ ఫలితము ఈజన్మలోనే అనుభవింపచేస్తుంది. అలాగే అతి ఘోరపాపములు చేసేవారు కూడా ఈ జన్మలోనే దాని ఫలితము అనుభవించేటట్లు చేస్తుంది. సంఘములో అవినీతికి పాల్పడినవారిని ప్రభుత్వము, శాసనము శిక్షించడము ఈ కోవలోనికే వస్తుంది.
ఇక సామాన్య పుణ్యపాపములను దైవము ముందు జన్మలలో అనుభవింపచేస్తుంది.
ఈ సామాన్య పుణ్యఫలితము దైవం ప్రకృతి భీభస్తమములలో మీ పుణ్యఫలితమును ఉపయోగించి సృష్టిని కాపాడి మీ పుణ్యమును అనేక రెట్లు పెంచి మీకు కావలసిన సమయములో ఆ పుణ్య ఫలితమును అందిస్తుంది.
అదేవిధముగ మనము చేసే పాపములను అనుభవించటానికి వలసిన ఓర్పును నేర్పును మనకు కాలక్రమేణా అందేటట్లు చేస్తుంది.
కాబట్టి దైవలీలలను మనము ఓర్పుతో అర్ధము చేసుకుని, సహనము వహించి, దైవభక్తితో ఉండటము అలవాటు చేసుకోవాలి. దైవమును దూషించరాదు.
శ్రీ రామాయణములో రాముని పట్టాభిషేకము రేపు అనగా, రాత్రికి రాత్రి ఘట్టములు సంభవించి శ్రీరాముడు అడవులకు వెళ్ళే పరిస్థితి దాపురిస్తే, లక్ష్మణ స్వామి చలించిపోయి "అన్నయ్యా! నాకు అనుమతినిస్తే తండ్రిని ఎదిరించి, నీకు పట్టాభిషేకము చేస్తా! ఏమిటి! దైవము, దైవము అంటావు?" అని దైవదూషణకు దిగుతాడు.
అప్పుడు శ్రీరాముడు ఎంతో ఓర్పుతో "లక్ష్మణా! దైవము నీకు కనబడితేకదా? నువ్వు దైవాన్ని ఎమైనా చేశేది?" అని వారించి లక్ష్మణస్వామిని దైవదూషణా పాపాన్నించి తప్పించి అడవులకు పయనమవుతాడు.
ఇక్కడ గమనించాల్సింది," కనపడని దైవాన్ని నిందించి ప్రయోజనము లేదు, దైవశాసనాన్ని పాలించడమే మానవకర్తవ్యం" అనే శ్రీరామవాక్యాన్ని.
కాబట్టి మనమందరం సదా మన మనస్సనే రాగి చెంబును మలినం కాకుండా భక్తి అనే చింతపండుతో ఎల్లప్పుడూ తోముతూ, నిరంతరము దైవచింతనతో ఉంటే మనస్సు నిర్మలంగా ఉండి, జీవితంలో కలిగే ఆటుపోటులకు కృంగిపోకుండా సాగిపోయేటట్లు,
చేసుకోవాలి.
దానికి పూర్తిశరణాగతి ఒక్కటే మార్గము. భగవంతుని పాదములు మనస్సులో తలచుకుని, ఆయన పాదములు పట్టుకుని, " నేను నీ శరణాగతుడను, నీ పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను. జన్మజన్మలలో నేను చేసిన పాపములు మన్నించి, నన్నురక్షించు, తండ్రీ , మనసా,వాచా, కర్మణా, ఎటువంటి తప్పులు నాతో చేయించకుండా, నా మనసు నీ పాదపద్మములలో లగ్మమయేలా చేసి, నన్ను మంచి మార్గములో నడిపించు తండ్రి!" అని ఆర్తితో ప్రార్ధించండి.
ఆ ప్రార్ధనకు భగవంతుడు కరిగిపోయి, మీకు వెంటనే కావలిసినవన్నీ సమకూరుస్తాడు.
స్వస్తి.
🌼 🌼 🌼 🌼 🌼 🌼 🌼 🌼 🌼
No comments:
Post a Comment