*ప్రశ్న: రామప్పగుడి ఇటుకలు నీటిలో వేసినా మునగవట ! ఎందువల్ల ?*
"""""""""""""""""""""""""""'"'"""""""""""""""""""""""
జవాబు: రామప్ప దేవాలయాన్ని తయారు చేసిన ఇటుకలన్నీ తేలేవి కాదు. చాలా ఇటుకలు నీటిలో మునిగేవీ ఉన్నాయి. కానీ గోడలు, పైకప్పుల బరువు ఎక్కువ కాకుండా ఉండేలా రెండు మూడు వరుసల మేర ప్రత్యేకంగా తయారు చేసిన ఇటుకల్ని వాడారు. ఇందులో శాస్త్రీయబద్ధమైన ఆలోచన కొన్ని శతాబ్దాల ముందే ఆనాటి రూపశిల్పికి, కార్మికులకు రావడమే ఆశ్చర్యం. ఇటుకలను చెరువు మట్టితో తయారుచేసే క్రమంలో ఆ మట్టిలో తేలికపాటి విత్తనాలు, రేగుపళ్ల గింజలు, రంపపు పొట్టు, వరిపొట్టు కలిపి భట్టీలో పెడతారు. లోపలున్న విత్తనాలు, పొట్టులాంటివి మండిపోయి ఆ లోపల ఖాళీ ప్రదేశాలు ఏర్పడతాయి. మిగతాచోట ఇటుక గట్టిగా ఉంటుంది. లోపల ఖాళీలు ఉండటం వల్ల ద్రవ్యరాశి తగ్గుతుంది. రూపం మాత్రం ఇటుకలానే ఉండటంతో ఘనపరిమాణంలో మార్పుండదు. సాంద్రత తగ్గుతుంది. ఇలా తగ్గిన సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండేలా చేస్తే అలాంటి ఇటుకలు తాత్కాలికంగా నీటిపై తేలుతాయి.
No comments:
Post a Comment